టీపాడ్‌ రక్తదాన శిబిరానికి భారీ స్పందన

9 Apr, 2022 13:21 IST|Sakshi

బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరతను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్‌) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఐటీ కంపెనీ అయిన ఐటీ స్పిన్‌ ఆవరణలో టెక్సాస్‌లోని అతి పెద్ద బ్లడ్‌బ్యాంక్‌ కార్టర్‌ బ్లడ్‌ కేర్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫ్రిస్కో, ఎల్లెన, మెక్‌కెన్నీ, ప్రాస్పర్‌, ప్లేనో, ఐర్వింగ్‌, కాపెల్‌ తదితర ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. శిబిరం ఏర్పాటు చేసిన ఐటీ స్పిన్‌ ఆవరణలో బ్లడ్‌బ్యాంక్‌ వ్యాన్‌ ను  చూసిన కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం.

ఈ శిబిరంలో 150 మంది చికిత్సకు సరిపోయేలా 50 పింట్ల రక్తాన్ని సేకరించారు. ఇది సుమారు 10 గుండె శస్త్రచికిత్సలకు సరిపోతుందని కార్టర్‌ బ్లడ్‌కేర్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరానికి ఇంతగా స్పందన వస్తుందని తాము ఊహించలేదని, అంచనాలను మించి రక్తాన్ని సేకరించామని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టీపాడ్‌ గత ఎనిమిదేళ్ల నుంచి ఇది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా, ఇది తొమ్మిదవది. ప్రతిసారి రక్తదానానికి అవసరమైన పరిసరాలను కల్పించిన ఐటీ స్పిన్‌ కంపెనీ యాజమాన్యం రఘువీర్‌ బండారు, ఉమా బండారులకు టీపాడ్‌ కృతజ్ఞతలు తెలిపింది. 

ఎప్పటిలాగే టీపాడ్‌.. 2022లో కార్యక్రమాలను రక్తదాన శిబిరంతో మొదలుపెట్టడం విశేషం. డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి సగర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రేణుకా చనమోలు సహాయంతో స్వప్న తుమ్మపాల సమన్వయం చేశారు. అజయ్‌రెడ్డి, రమణ లష్కర్‌, ఇంద్రాని పంచెర్పుల, పండు పాల్వాయ్‌ నిర్దేశం చేశారు. టీపాడ్‌ సేవలను కార్టర్‌ బ్లడ్‌కేర్‌ నిర్వాహకులతో పాటు రక్తదాతలు, స్థానికులు అభినందించారు.

మరిన్ని వార్తలు