భారత సంతతి వైద్యుడికి యూఎస్‌ సీడీసీలో కీలక పదవి

17 Jan, 2023 07:56 IST|Sakshi

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలక సేవలు అందించడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎంతో కృషి చేసిన భారతీయ-అమెరికన్ డాక్టర్‌ నీరవ్ డి. షా యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US CDC)లో ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం మైనే సీడీసీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన మార్చిలో తన నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ‌కి ఆయన రిపోర్ట్ చేయనున్నారు.

దీనిపై షా మాట్లాడుతూ.. “ఇంతకాలం నాకెంతో సహకరించిన మైనే ప్రజలకు నా ధన్యవాదాలు, వారితో ప్రయాణం మరిచిపోలేనిదని పేర్కొన్నారు. ఏజెన్సీ, రాష్ట్ర ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను పునర్నిర్మించే లక్ష్యంతో షా 2019లో మైనే సీడీసీలో బాధ్యతలు చేపట్టారు. మైనే గవర్నర్ జానెట్ మిల్స్ తన ట్వీట్‌లో.. “డాక్టర్ షా నాకు నమ్మకమైన సలహాదారు మాత్రమేకాదు మైనే సీడీసీ(Maine CDC)లో అసాధారణ నాయకుడు కూడా. ముఖ్యంగా కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని’ కొనియాడారు.

భారత్ నుంచి వలస వెళ్లిన షా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. షా విస్కాన్షిన్‌లో పెరిగాడు. లూయిస్‌విల్లే యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రం, జీవశాస్త్రంలో ఆయన పట్టా పొందారు. అనంతరం ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 2000లో చికాగో విశ్వవిద్యాలయంలో వైద్య పాఠశాలలో చేరారు. షా 2007లో తన జ్యూరిస్ డాక్టర్‌, 2008లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్‌ను పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు