ఎన్నారై వార్త: పాపం ఫ్యామిలీమ్యాన్‌ .. కొడుకు కోసం వెళ్లి కానరాని లోకాలకు..

7 Feb, 2023 08:30 IST|Sakshi

కొడుకు కోసం బయటకు వెళ్లిన ఆ తండ్రి.. కానరాని లోకాలను వెళ్లిపోయాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. భర్త అంత్యక్రియల కోసం ఆమె విరాళాల సేకరణకు సిద్ధపడింది. అయితే అంత బాధలోనూ తన భర్త కిడ్నీలను స్వచ్ఛందంగా దానం చేసి మంచి మనుసు చాటుకుంది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

భారత సంతతికి చెందిన ప్రీతేశ్‌ పటేల్‌(39).. దశాబ్దానికి పైగా లాంకాస్టర్‌లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబం కోసం బాగా కష్టపడుతూ వచ్చాడు. ఆపై భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి డౌఫిన్ కౌంటీ(పెన్సిల్వేనియా)కి షిప్ట్‌ అయ్యాడు. అక్కడే కొత్తగా ఏదైనా జాబ్‌లో చేరాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ లోపు మృత్యువు అతన్ని బలిగొంది. ప్రీతేశ్‌ చిన్నకొడుక్కి టైప్‌ 1 డయాబెటిస్‌ ఉంది. అతని కోసం ఇన్సులిన్‌తో పాటు పోకేమాన్‌ బొమ్మను కొనుగోలు చేసేందుకు  జనవరి 27వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

అయితే వాల్‌మార్ట్‌ దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో సిగ్నల్‌ వద్ద  ఓ వాహనం ఢీ కొట్టి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అధికారులు అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జనవరి 30వ తేదీన అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదంలో తప్పెవరిదో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు  ప్రీతేశ్‌ అంత్యక్రియల నిర్వహణకు.. GoFundMe ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది అతని కుటుంబం.

మరిన్ని వార్తలు