ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఫ్లైట్‌ చార్జీల బాదుడు.. వామ్మో! ఈ రేంజ్‌లోనా?

3 Dec, 2021 13:11 IST|Sakshi

పరిస్థితులు అంతా చక్కబుతున్నాయని అనుకునేలోగా ఒమిక్రాన్‌ రూపంలో మరొ కొత్త ముప్పు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై క్రమంగా ఆంక్షలు సడలిస్తున్న తరుణంలో కరోనా న్యూ వేరియంట్‌ వార్తలు తిరిగి గందరగోళం సృష్టిస్తున్నాయి.
ఆంక్షల భయాలు
ఒమిక్రాన్‌ విజృంభంతో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారా ? ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారా అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫలితంగా మరో అంతర్జాతీయ ప్రయాణాలు సందిగ్ధంలో పడిపోయాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కారణంగా ఏ దేశం అంతర్జాతీయ ప్రయాణాల రద్దు, లాక్‌డౌన్‌ వంటి చర్యలు తీసుకోకపోయినా అనుమాన మేఘాలు అయితే అంతటా ఆవరించాయి. దీంతో ఒక్కసారిగా విమానఛార్జీల ధరలు రెండింతలు అయ్యాయి.

క్రిస్మస్‌ సీజన్‌
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పెరగడంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. వివిద దేశాల మధ్య విమాన సర్వీసులు మొదలవుతున్నాయి. విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భారతీయులు ప్రయాణాలకు రెడీ అవుతున్నారు. మరోవైపు క్రిస్మస్‌ సీజన్‌ కావడంతో యూరప్‌, అమెరికాలో డిసెంబరులో పండుగ వాతవారణం నెలకొంటుంది. ఏడాదిన్నరగా తమ వాళ్లకు దూరమైన ఎన్నారైలు తమ వారిని అమెరికా రప్పించుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఒమిక్రాన్‌ భయాలు వారి బడ్జెట్‌ ప్లాన్స్‌ని తలకిందులు చేస్తున్నాయి. 
పెరిగిన డిమాండ్‌
ఒమిక్రాన్‌ విజృంభిస్తే ఏ క్షణమైనా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావచ్చనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. దీంతో కఠిన ఆంక్షలు అమల్లోకి రాకముందే ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారను. ఫలితంగా ఒక్కసారిగా విమాన ప్రయాణాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఏడాది కాలంగా సర్వీసులు లేకుండా నష్ట్లాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఇదే అదనుగా భావించిన అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గల్ఫ్‌ మొదలు యూఎస్‌ వరకు అన్ని విమానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కీలకమైన మార్గాల్లో ధరలు దాదాపుగా ఇలా ఉన్నాయి
- విమాన ప్రయాణాలకు సంబంధించి న్యూఢిల్లీ నుంచి కెనడాలో లోని టోరంటోకి కనీస ఛార్జీ రూ.80వేలు ఉండగా ఇప్పుడది రూ. 2.37 లక్షలకు చేరుకుంది.
- ఢిల్లీ లండన్‌ల మధ్య ప్రయాణానికి గతంలో రూ. 60,000 ఖర్చు అవగా ఇప్పుడు రూ. 1.20 లక్షలకు చేరుకుంది
- ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే గల్ఫ్‌ దేశాలకు చెందిన విమాన సర్వీసుల్లో గతంలో టిక్కెట్‌ చార్జీ రూ. 20 వేలను మించలేదు. ప్రస్తుతం అది రూ. 33 వేల దగ్గర ఉంది.
- ఇండియా నుంచి అమెరికాలోని ప్రధాన నగరాలకు విమాన ఛార్జీలు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షలు ఉండగా ఇప్పుడు కనీసం రూ.1.70 లక్షలకు చేరుకుంది. షికాగో, వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌ సిటీ వంటి నగరాలకయితే చార్జీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధరలు రూ.6 లక్షలుగా ఉన్నాయి. 
 

చదవండి: ఎయిర్‌పోర్టులో కోవిడ్‌ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది?

మరిన్ని వార్తలు