శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఆధ్వర్యంలో  "శివ భక్తి గీతాలాపన"

18 Feb, 2023 17:02 IST|Sakshi

 సింగపూర్‌: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివ భక్తి గీతాలాపన" ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంలో శనివారం నిర్వహించారు. కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించిన, ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ  నటి జమున ,  కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి నివాళిగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు

సింగపూర్‌లో నివసించే గాయనీ గాయకులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలతోపాటు,   విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం శంకరాభరణం తదితర సినిమాల పాటలు, అలాగే జమున నటించిన నాగులచవితి సినిమా పాటలు ఆలపించడం విశేషం. 

ఆత్మీయ అతిథిగా వంశీ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు పాల్గొని శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వంశీ గౌరవాధ్యక్షురాలు జమున, విశ్వనాథ్‌తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని  గుర్తుచేసుకున్నారు. వారి పేర్లపై త్వరలో అవార్డులు స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తామని ప్రకటించారు.

రాధిక మంగిపూడి కార్యక్రమాన్ని నిర్వహించగా గాయనీ గాయకులుగా శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు వివిధ శివ భక్తి సంకీర్తనలను మధురంగా ఆలపించారు. 

రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారధ్యంలో యూట్యూబ్, ఫేస్బుక్  ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ ఈ కార్యక్రమాన్ని క్రింది లింకు ద్వారా వీక్షించవచ్చు. 

మరిన్ని వార్తలు