రోగ నిరోధక శక్తి పెరగాలంటే చిరుధాన్యాలే సరి..!: ఖాదర్ వలి

21 Apr, 2021 20:43 IST|Sakshi

నాట్స్ వెబినార్‌లో స్పష్టం చేసిన ఖాదర్ వలి

వాషింగ్టన్‌: చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి లభిస్తుందని మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌), ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో స్పష్టం చేశారు. తరతరాల నుంచి వాడిన చిరు ధాన్యాలను మనం విస్మరించడం వల్ల నేడు అనేక రోగాలు, వైరస్‌లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ఆయన అన్నారు. నాట్స్, ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఖాదర్ వలి మాట్లాడారు. కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు ఈ ఐదింటిలో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయని ఆయన వివరించారు. మనలోని రోగ నిరోధక శక్తిని ఈ ఐదు చిరు ధాన్యాల వాడకంతో పెంచుకోవచ్చని తెలిపారు.

మన ఆరోగ్యాన్ని మన పూర్వీకులు ఎలా కాపాడుకున్నారు..? వాళ్లు ఎందుకు అంత బలంగా ఉన్నారనే విషయాన్ని ఖాదర్ వలి వివరించారు. ఈ వెబినార్ లో పాల్గొన్న అనేక మంది అడిగిన ఆరోగ్య ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. చిరు ధాన్యాలపై ఉన్న సందేహాలను తీర్చారు. చిరు ధాన్యాల వాడకాన్ని మన జీవన విధానంలో భాగం చేసుకుంటే సగం  జబ్బులను నియంత్రించవచ్చని తెలిపారు.కాగా ఈ వెబినార్‌కు దాదాపు 200 మందికి పైగా ఔత్సాహికులు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానమయ్యారు.

ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్  రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల, తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్లలకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది.

చదవండి: అన్నమయ్య సంకీర్తనలు- సామాజిక దృక్పథంపై కార్యక్రమం

మరిన్ని వార్తలు