అమెరికాలో దేవరకొండవాసి సజీవదహనం! 

30 Dec, 2020 00:31 IST|Sakshi
మృతుడు నల్లమాద దేవేందర్‌రెడ్డి (ఫైల్‌) 

కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం 

మృతుడు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికార ప్రతినిధి

సాక్షి, కొండమల్లేపల్లి: అమెరికాలో నల్లగొండ జిల్లా దేవరకొండవాసి మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి చెందిన నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడు దేవేందర్‌రెడ్డి.. 1998లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఐటీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

ఉదయం 6 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్ద ఉన్న కారు స్టార్ట్‌ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర గాయాలై∙దేవేందర్‌రెడ్డి మృతి చెందినట్లు మృతుడి సోదరుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. దేవేందర్‌రెడ్డికి భార్య అనురాధ, ఏడేళ్ల కుమార్తె చెర్రి ఉంది. దేవేందర్‌రెడ్డి మృతితో సొంతూరు కర్నాటిపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయితే దేవేందర్‌రెడ్డికి మృతికి గల కారణాలు తెలుస్తాయని మృతుడి బంధువులు చెప్పారు. దేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికార ప్రతినిధి. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

మరిన్ని వార్తలు