మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి

13 Jan, 2022 20:57 IST|Sakshi

అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తోన్న ఓ ప్రవాస భారతీయుడిపై న్యూయార్క్‌లో దాడి జరిగింది. అంతేకాదు ఎన్నారైని ఉద్దేశించి జాత్యాహాంకర వ్యాఖ్యలకు దిగాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అవగా బాధితుడికి అండగా భారతీయ సంఘాలు నిలబడ్డాయి. ఈ ఘటకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. 

అమెరికాలో దాడికి సంబంధించిన వివరాలను హిందూ పత్రిక ప్రచురించింది. హిందూ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జనవరి 3న జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 4 దగ్గర తన కారును పార్క్‌ చేశారు. ఇంతలో కస్టమర్‌ రావడంతో కారును ముందుకు కదిపేందుకు ప్రయత్నించగా అక్కడ మరో ట్యాక్సీ నిలిపి ఉంది. వెంటనే కారు దిగిన సింగ్‌.. తన కారు వెళ్లేందుకు వీలుగా ముందున్న కారును పక్కకు తీయాలంటూ అందులో ఉన్న వ్యక్తిని కోరాడు.

సింగ్‌ కారు దిగడం ఆలస్యం కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ముఖం, ఛాతిపై పంచ్‌లు విసిరాడు. దాడికి పాల్పడుతూనే సింగ్‌ తలకు ఉన్న టర్బన్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ‘ టర్బనేడ్‌ పీపుల్‌, గో బ్యాక్‌ టూ యువర్‌ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయాడు.

జరిగిన ఘటనపై సింగ్‌ వెంటనే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న పోర్టు అథారిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేశాడు. అయితే సింగ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సిక్కు కమ్యూనిటీల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో బాధితుడికి న్యాయం జరిగేందుకు వీలుగా ఒక డిటెక్టివ్‌, న్యాయవాదిని నియమించారు. 

చదవండి: దేశమేదైనా అండగా మేమున్నాం

>
మరిన్ని వార్తలు