Guru Purnima : ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ

26 Jul, 2021 20:34 IST|Sakshi

ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు.  ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు.  

గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా  దేశాల్లో నృత్య  ప్రదర్శనలు నిర్వహించారు.  జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్​ నృత్య ప్రదర్శన జరిగింది. 

మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి  ద్వాదశ జ్యోతిర్లింగాలను  వర్ణిస్తూ  సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా  నృత్య ప్రదర్శన చేశారు. 
 
ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్​ నెస్​ ఆఫ్​ గాడ్​ అనే కాన్సెప్ట్​తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను  ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో  అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల  బృందం పాల్గొన్నారు.

ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా  కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు

ఈ కార్యక్రమంలో రాజేష్  శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం,  నైనా శిష్య బృందాలు (భరత నాట్యం),  భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం),  హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం),  మిత్ర శిష్యబృందం (మణిపురి),   ప్రగ్య ,  దిపన్విత శిష్యబృందాలు (కథక్​)లు ప్రదర్శించారు. 

గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ  వాణీ గుండ్లపల్లి ,  రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు.  వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది. 


 

మరిన్ని వార్తలు