ఇండియన్‌ కాల్‌సెంటర్లపై అమెరికాలో కేసు నమోదు

9 Feb, 2022 15:26 IST|Sakshi

అమెరికన్‌ పౌరులను తప్పుదోవ పట్టించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న భారతీయ కాల్‌ సెంటర్లపై అమెరికా అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహరంలో మొత్తం ఆరు కాల్‌సెంటర్లు, వాటి డైరెక్టర్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. అంతకు ముందు 2020 నవంబరులో ఓ కాల్‌ సెంటర్‌పై ఇదే తరహా నేరారోపణలు మోపారు.

నార్తర్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ జార్జియా, యూఎస్‌ అటార్నీ ఆఫీసు తెలియజేసిన వివరాల ప్రకారం వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ ఆధారంగా స్కామ్‌ కాల్స్‌ చేస్తూ  అమెరికన్‌ పౌరులను తప్పుదోవ పట్టించి వారి దగ్గర నుంచి డబ్బులు కాజేశారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ సేవ్సింగ్‌ నుంచి భారీ మొత్తంలో సొమ్ము పక్కదారి పట్టించారు. నవంబరులో నమోదైన కేసుకు సంబందించి 2015 నుంచి 2020 వరకు 20 మిలియన్‌ డాలర్లు తస్కరించారు. ఈ మేరకు 1.30 లక్షల స్కామ్‌ కాల్స్‌ చేశారు. తాజాగా అభియోగాలు నమోదైన కాల్‌ సెంటర్లు, డైరెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
- మను చావ్లా అండ్‌ అచీవర్స్‌ ఏ స్పిరిట్‌ ఆఫ్‌ బీపీవో సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
- సుశీల్‌ సచ్‌దేవ, నితిన్‌ కుమార్‌ వద్వానీ, ‍స్వర్ణదీప్‌సింగ్‌ ఆలియాస్‌ సవరన్‌ దీప్‌ కోహ్లీ (ఫిన్‌టాక్‌ ‍గ్లోబల్‌)
- దినేష్‌ మనోహర్‌ సచ్‌దేవ్‌ (గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌)
- గజేసింగ్‌ రాథోడ్‌ (శివాయ్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)
- సంకేత్‌ మోదీ (ఎస్‌ఎమ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)
- రాజీవ్‌ సోలంకి ( టెక్నోమైండ్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌)

ఈ కాల్‌ సెంటర్ల నుంచి అమెరికన్‌ సిటిజన్స్‌కి స్కామ్‌ కాల్‌ చేస్తూ తాము ఇంటర్నల్‌ రెవిన్యూ సర్వీస్‌ నుంచి మాట్లాడుతున్నామని.. మీ సోషల్‌ సెక్యూరిటీ నంబర్‌ మీద పలు కేసులు నమోదు అయ్యాయని చెప్పి మాటాల్లో పెట్టేవారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతా ఇతర వివరాలు సేకరించి డబ్బులు దోచుకునే వారు.

ఈ తరహా కేసులు ఎక్కువైపోవడంతో అమెరికన్‌ పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. చివరకు మోసాలకు పాల్పడుతున్నారనే అభియోగంపై ఆరు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ కొనసాగనుంది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన అహ్మదాబాద్‌కి చెందిన కాల్‌సెంటర్‌ డైరెక్టర్‌కి 20 ఏళ్ల శిక్ష విధించాయి అమెరికన్‌ న్యాయస్థానాలు.
చదవండి: గుజరాత్‌లో ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు

మరిన్ని వార్తలు