అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం?

20 Jan, 2022 09:48 IST|Sakshi

మానవత్వం మాయం అవుతున్న ఈ రోజుల్లో.. ఇంకా కొందరు తమలో జాలి, దయ, ప్రేమ ఉన్నాయని నిరూపించారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాదితో భాదపడుతున్న 2 ఏళ్ల బాలుడిని కాపాడటం కోసం సింగపూర్‌ వాసులందరు ఒక్కటయ్యారు. భారత సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు సింగపూర్‌ వాసుల సహాయంతో ప్రపంచంలోనే అరుదైన స్పెనల్‌ మస్కులర్‌ అట్రోఫీ(ఎస్‌ఎంఏ) వ్యాధి నుంచి కోలుకున్నాడు. బాలుడు చికిత్స కోసం దాదాపు 30 లక్షల సింగపూర్ డాలర్లు(రూ.16.68 కోట్లు) విరాళంగా ఇచ్చి సింగపూర్ వాసులు తమ సహృదయాన్ని మరోసారి చాటారు. 

దేవదాన్ దేవరాజ్ భారత సంతతికి చెందిన ప్రభుత్వోద్యోగి డేవ్ దేవెరాజ్, ఇంటీరియర్ డిజైనర్ భార్య షు వెన్ దేవరాజ్(చైనీస్ సంతతి)ల ఏకైక సంతానం. భార్యాభర్తలిద్దరూ 33 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నారు. దేవదాన్‌ అనే చిన్నారి అరుదైన స్పెనల్‌ మస్కులర్‌ అట్రోఫీ(ఎస్‌ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే, ఈ వ్యాధి నయం చేయాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా పిలిచే జోల్‌గెన్‌స్మా ఇంజెక్షన్‌ అవసరం. దీనిని అమెరికా సంస్థ తయారు చేస్తోంది. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చినప్పటికీ, సింగపూర్‌ హెల్త్‌ సైన్సెస్‌ అథారిటీ మాత్రం ఆమోదించలేదు. కానీ స్పెషల్‌ యాక్సెస్‌ రూట్‌ కింద ఈ ఇంజెక్షన్‌ను దిగుమతి చేసుకోవచ్చు. 

చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకున్న “రే ఆఫ్‌ హోప్‌ ” అనే స్వచృంద సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలను సేకరించే పనిని ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థ విరాళను సేకరించడం ప్రారంభించిన కేవలం 10 రోజుల్లోనే భారత సంతతి చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు స్థానిక సింగపూర్‌ వాసులు అందరూ కలిసి రూ.16.68 కోట్లను విరాళ రూపంలో అందజేశారు. దేవదాన్ చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ఛారిటీ 'రే ఆఫ్ హోప్' ద్వారా సుమారు 30,000 మంది విరాళం ఇచ్చినట్లు ఛారిటీ పేర్కొంది. రే ఆఫ్ హోప్ జనరల్ మేనేజర్ టాన్ ఎన్ మాట్లాడుతూ.. మేము ఇప్పటి వరకు సేకరించిన విరాళలో ఇదే పెద్ద మొత్తం అని తను పేర్కొన్నారు. చిన్నారి తల్లి షువెన్‌ మాట్లాడుతూ.. దేవదాన్‌ను రక్షించడానికి ముందుకు వచ్చిన దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. 

(చదవండి: దేశంలో కొనసాగుతున్న డిజిటల్‌ చెల్లింపుల హవా..!)

మరిన్ని వార్తలు