అదే భారత్‌ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు

4 Jul, 2022 12:30 IST|Sakshi

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున​ పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్‌ రుచికా శర్మ ఇంటర్వ్యూ...

నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్‌ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్‌ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు.

ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్‌ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. 

మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం  బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్‌ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్‌ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. 

పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇

మరిన్ని వార్తలు