సింగపూర్‌లో ఘనంగా ‘నారీ-2022’

17 Aug, 2022 21:09 IST|Sakshi

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అక్కడ నివసించే తెలుగు వనితల కోసం "నారి -2022" అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. స్థానిక ఆర్చర్డ్ హోటల్లో హారితేజ వ్యాఖ్యాతగా ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది వనితలు హాజరయ్యారు. ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, సంస్కృతి, యువత అభివృద్ధి  శాఖా మంత్రి ఆర్.కె రోజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ యస్ టి యస్ పోటీలు, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఆటలు, వేషభాషల అనుకరణ పోటీలు , ఇన్స్టరీలు పోటీలు, స్టెప్స్ ఛాలెంజ్, అమ్మ కూతుర్ల సరదా సందడి పోటీ, వివిధ వినోదభరితమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. సంప్రదాయ భద్రంగా వివిధ రకాల చీరలతో నిర్వహించిన ప్రదర్శన సింగపూర్ బుక్ ఆఫ్ రికార్ద్స్లో స్థానం సంపాదించడం విశేషం.

మంత్రి రోజా మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, ఇంత మంది మహిళలు హాజరుకావడం, దానికి తనను ముఖ్య అతిధి ఆహ్వానించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి  మాట్లాడుతూ మహిళల కోసం ఈ కార్యక్రమం చేయటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆహుతులను అలరింపచేసిన  హారితేజకు, సునీతకు కృతజ్ఞతలు  తెలియజేశారు.

తన బిజీషెడ్యూల్ని పక్కనబెట్టి ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి రోజాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు కృషిచేసిన కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు