డాల‌స్‌లో బతుకమ్మ, దసరా పండుగలను మళ్లీ ఘనంగా నిర్వహిస్తాం: టీపాడ్‌

17 Feb, 2022 08:59 IST|Sakshi

బతుకమ్మ, దసరా పండుగలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ గర్వించేలా నిర్వహిస్తామని అమెరికాలోని డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్‌) నూతన కమిటీ ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారి క్రమంగా కనుమరుగవుతున్నందున ఈ ఏడాది పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించిన అమెరికాలోని డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్‌)కి 2022 సంవత్సరానికి గాను కొత్తపాలకవర్గం ఎన్నికయింది.

నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు పాలకమండలి సభ్యులందరూ ఫిబ్రవరి 12వ తేదీన ఫ్రిస్కో నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక నేతలు, టీపాడ్‌ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమెరికా, భారత జాతీయ గీతాలను ఆలపించారు. రూప కన్నయ్యగారి, అనురాధ మేకల నిర్వహణలో స్థానిక గాయకులు స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రావణ్‌కుమార్‌ శ్రావ్యమైన గీతాలతో ఆహుతులను అలరించారు. గతేడాది బాధ్యతలు నిర్వర్తించిన కమిటీ సభ్యులు కొత్త పాలకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రమాణస్వీకారం చేయించారు. 

లతా మంగేష్కర్‌కు ఘన నివాళి
కార్యక్రమంలో భాగంగా పద్మవిభూషణ్‌, బాబాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ఇటీవలే పరమపదించిన లెజెండరీ సింగర్‌ లతామంగేష్కర్‌కు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

వేలాది మందితో పండుగల నిర్వహణ
అనంతరం బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రాణి పంచెర్పుల, అధ్యక్షుడుగా ఎన్నికైన రమణ లష్కర్‌, సమన్వయకర్త పాండురంగారెడ్డి పాల్వాయి, కార్యదర్శి లక్ష్మీ పోరెడ్డి, ఉపాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నందున.. ఎప్పటి మాదిరే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలుగు ప్రజలు గర్వించేలా బతుకమ్మ, దసరా పండుగలను వేలాది మందితో భారీఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను, భోజన వితరణను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. 

సంస్కృతి, సంప్రదాయాలను సుసంపన్నం చేస్తూ..
ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ అజయ్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ జానకీరాం మందాడి, రావు కల్వల, రఘువీర్‌ బండారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రేపటితరానికి అందించడంతో పాటు తాము నివసిస్తున్న ప్రాంతాల సంస్కృతిని సుసంపన్నం చేయడమే టీపాడ్‌ లక్ష్యమని వివరించారు. నరేష్‌ సుంకిరెడ్డి, కరణ్‌ పోరెడ్డి, చంద్ర పోలీస్‌ మరియు సతీష్‌ నాగిళ్ల మాట్లాడుతూ కొత్త ఎన్నికైన పాలకమండలి సభ్యులను అభినందించారు.

మహిళల భాగస్వామ్యంతోనే టీపాడ్‌ విజయవంతం
ఫ్రిస్కో పార్క్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ బోర్డ్‌ సభ్యుడు, టీపాడ్‌ సలహాదారు అయిన వేణు భాగ్యనగర్‌ మాట్లాడుతూ.. డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి కారణం మహిళల భాగస్వామ్యమేనని కొనియాడారు. చివరగా.. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(టీఏఎన్‌టీఈఎక్స్‌) మరియు ఇండియన్‌ అసోసియేషన్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఐఏఎన్‌టీ)లో పలు పదవులను అలంకరించడంతో పాటు ప్రస్తుతం నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) అధ్యక్షుడుగా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డి కొర్సపాటిని టీపాడ్‌ నాయకత్వం సత్కరించింది. 

కొత్త కమిటీలో ఎవరెవరంటే...
2022 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో రమణ లష్కర్‌, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీపోరెడ్డి, రత్న ఉప్పల, రవికాంత్‌ మామిడి, లింగారెడ్డి అల్వా, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, మంజుల తొడుపునూరి, శ్రీధర్‌ వేముల, శ్రీనివాస్‌ అన్నమనేని, శంకర్‌ పరిమల్‌, గాయత్రి బుషిగంపల, స్వప్న తుమ్మపాల, రేణుక చనమోలు ఉంటారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌గా టీపాడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌గా ఇంద్రాణి పంచెర్పుల, సుధాకర్‌ కలసాని, పాండురంగారెడ్డి పాల్వాయి, గోలి బుచ్చిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, అశోక్‌  కొండల, పవన్‌ గంగాధర, రావు కల్వల, జానకీరాం మందాడి, రఘువీర్‌ బండారు, రాం అన్నాడి వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు