అమెరికాలో ఘనంగా ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖీ’ కార్యక్రమం!

15 Jul, 2022 12:25 IST|Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో 'తనికెళ్ళ భరణితో ముఖాముఖీ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, నల్లూరి ప్రసాద్‌లు తనికెళ్ళ భరణిని సాదరంగా ఆహ్వానించారు. తానా మాజీ అధ్యక్షులు డాక్టర్‌ తోటకూర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. రంగస్థలంపై మొదలెట్టి.. రంగుల ప్రపంచంపై ముద్ర వేసిన తనికెళ్ల భరణి గొప్పతనాన్ని కొనియాడారు.   

2 గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ప్రసంగం అతిధుల్ని ఆకట్టుకుంది.ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాధాన్యంపై భరణి ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో భాగంగా  తానా, టాన్ టెక్స్ సంస్థల నాయకులు ముఖ్యఅతిథి తనికెళ్ళ భరణిని 'బహుముఖ కళావల్లభ' అనే బిరుదుతో ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో కొణిదల లోకేష్ నాయుడు, ప్రసాద్ నల్లూరి, గిరి గోరంట్ల, వెంకట్ బొమ్మా, సతీష్ మండువ, కుమార్ నందిగం, కృష్ణమోహన్ దాసరి, రవీంద్ర చిట్టూరి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, చలపతి కొండ్రగుంటలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు