ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

1 Feb, 2021 19:03 IST|Sakshi

కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వినూత్నంగా యూట్యూబ్‌లో వర్చువల్‌గా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, కార్యక్రమ సమన్వయ కర్త సరిత ఈదర అధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంస్థ 2020 సంవత్సరం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ప్రసంగిస్తూ.. ఎన్నో స్వచంద సేవా కార్యక్రామాలు జూమ్ ద్వారా సాంకేతిక శిక్షణలు ఈ కరోనా సమయములో చేయటము జరిగినట్లు తెలిపారు. కరోనా విరాళాలను మూడు భాగములుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, అలాగే డల్లాస్ టెక్సాస్ రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలియ జేశారు. అంతేకాక 2021 పాలక మండలికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం కృష్ణా రెడ్డి కోడూరు సంస్థ నూతన అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటిని పరిచయం చేశారు.

2021 అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ప్రసంగిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరికి కృతఙ్ఞతలు తెలియజేశారు. డల్లాస్‌లోని తెలుగు వారి కోసం ప్రస్తుతం చేస్తున్న సేవ కార్యక్రమాలే కాకుండా, మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియ చేశారు. టాంటెక్స్ నూతన కార్యవర్గ సభ్యులను ఒక పాట రూపంగా అందరికీ పరిచయం చేశారు. ఉమా మహేష్ పార్నపల్లి ఉత్తరాధ్యక్షుడుగా, శరత్ రెడ్డి ఎర్రం ఉపాధ్యక్షులుగా, కళ్యాణి తాడిమేటి కార్యదర్శిగా, శ్రీకాంత్ రెడ్డి జొన్నల సహాయ కార్యదర్శిగా, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి కోశాధికారిగా, స్రవంతి ఎర్రమనేని సహాయ కోశాధికారిగా పరిచయం చేశారు. పాలక మండలి అధిపతి డాక్టర్ పవన్ పామదుర్తి, 2020 పాలక మండలి అధిపతి పవన్ నెల్లుట్ల  ప్రసంగిస్తూ.. అందరికీ 2021 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటితన ప్రసంగములో ఈ సంక్రాంతికి మీకు నచ్చిన మీరు మెచ్చిన కార్యక్రామాలను మీ ముందుకు తీసుకు వచ్చారు.

జానపద కళలకు పెట్టింది పేరు మన రెండు తెలుగు రాష్ట్రాలు. కాలక్రమేణా అలాంటి కళలు సరైన పోషకులు లేక అంతరించి పోతున్నాయి, అందువలన కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను మనము గుర్తుపెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. ఒకప్పుడు గ్రామీణులకు వినోదం, వికాసం అందించడంలో ప్రసిద్ధిగాంచిన బుర్ర కధలు, హరిదాసులు, గంగిరెద్దు మేళములు, జానపద పేరడీలు మొదలయిన కళలు మరుగున పడి పోకుండా కాపాడుకొంటూ వస్తున్న కళాకారులను ఇకపై మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. కళలను పోషిస్తూ కూడా దుర్భరమైన జీవనము గడుపుతున్న అలాంటి కళాకారుల కుటుంబాలను గుర్తించి మన టాంటెక్స్ సంస్థ ద్వారా వెలుగులోనికి తెచ్చి తగినంత సహాయము చేసి భావితరాలకు మన జానపద కళలను సజీవంగా అందించాలనే దే మా ప్రయత్నం. ఈ కార్యక్రమ ప్రదర్శనలకు విరాళాలిచ్చి ఆర్ధిక సహాయ సహకారాలందిస్తున్న పోషక దాతలకు మన సంస్థ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేజశారు.

అనంతరం తెలుగు వెలుగు సంపాదకులు శ్రీమతి స్రవంతి సంక్రాంతి సంచికను వర్చువల్‌గా అవిష్కరించారు. తాను 2020లో సాంస్కృతిక కార్యక్రమాలని కోవిడ్ మూలంగా చేయలేక పోయామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమీరా ఇల్లెందుల తమ వ్యాఖ్యానంలో సంక్రాంతి పండగ విశేషాలైన భోగిమంటలు, గొబ్బమ్మలు, గంగిరెద్దులు , హరిదాసులు, గాలిపటాలు వివరించారు. హరిదాసు (ప్రశాంత్ కుమార్) శ్రీ మద్రమా రమణ గోవిందో హరి అంటూ సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గంగిరెద్దు మేళం, డాక్టర్ అరుణ సుబ్బా రావు బృందముతో తోలుబొమ్మలాట, పేరడీ జానపద గేయాలు, శ్రీమతి హేమాంబుజ కట్టారి వీణామృతం, నాని బృందం కోలాటం, సినీ గాయని శ్రీమతి ఉషా గానములు, లాస్య సుదా అకాడమీ నుంచి కీర్తన, నర్తన కలవగుంట సోదరీమణుల నృత్య ప్రదర్సనలు,గలీనా అకాడమీ నుంచి శ్రీమతి స్వప్న గుడిమెళ్ళ శిష్యుల శాస్త్రీయ జానపద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి.

కొత్తగా భాధ్యతలు శ్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి సురేష్ పఠానేని ఎంతో నేర్పుగా సమయ స్పుర్తితో సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు నడిపించారు. కార్యక్రమ సమన్వయ కర్త సరిత ఈదరగారు, పోషక దాతల గురంచి పేరు పేరునా అభివందనములు తెలియజేశారు. అలాగే ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు