అసీం మహాజన్‌కు తెలుగు సంఘాల ఘన సన్మానం

20 Mar, 2021 18:29 IST|Sakshi

డల్లాస్, టెక్సాస్: కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్‌తో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్లో గురువారం ఆతిధ్య సమావేశం జరిగింది. వివిధ తెలుగు సంఘాల ప్రముఖ నాయకులు - రఘువీర్ బండారు – తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్); డా. శ్రీధర్ కొర్సపాటి – నా ర్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ (నాటా); డా. సంధ్యా రెడ్డి గవ్వ – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా); లక్ష్మి పాలేటి - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్టేక్ష్); మురళి వెన్నం -  తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా); శేఖర్ అన్నే- నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్); మహేంద్ర రావు – డల్లాస్ ఏరియా తెలంగాణా అసోసియేషన్ (డాటా)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికంగాను, జాతీయ స్థాయిలోను, మాతృ దేశంలోను చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కాన్సల్ జెనరల్‌కు వారు వివరించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున డా. ప్రసాద్ తోటకూర కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ను దుశాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ అభినందనకు కాన్సల్ జెనరల్ మహాజన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ – “అమెరికాలో తెలుగు వారి విజ్ఞానం, ఆధిక్యత - విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యాపారంలాంటి అన్ని రంగాలలోను విశేష ప్రభావం చూపుతోంది. అవసరమైనప్పుడు వీలైన సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా’’నని అన్నారు.
 

మరిన్ని వార్తలు