నాట్స్‌కు సొంత కారును విరాళమిచ్చిన తెలుగు మహిళ

26 Apr, 2021 15:21 IST|Sakshi

న్యూ జెర్సీ:  అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి తమ వంతు సహకారం అందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూజెర్సీకు చెందిన తెలుగు మహిళ బినోదిని వుతూరి తను వాడే సెడన్ కారును నాట్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించిన బినోదిని.. సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన మద్దతును తెలుపుతూ ఉంటారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలను తెలుసుకున్న బినోదిని తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటితో మాట్లాడి తన సొంత కారును విరాళంగా ఇస్తానని ప్రకటించగా,  అనుకున్న విధంగానే ఆమె కారుకు సంబంధించిన యాజమాన్య హక్కులను నాట్స్ ‌కు బదలాయించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని సహకరించారు.

నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహనకృష్ణ మన్నవ ఆధ్వర్యంలో నాట్స్ న్యూజెర్సీ విభాగం నుంచి శ్రీ హరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీవెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సురేశ్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, రాంబాబు వేదగిరి, మురళీ మేడిచెర్ల తదితర నాట్స్ నాయకులు బినోదిని ఇంటికి వెళ్లి కారు డాక్యుమెంట్లను స్వీకరించారు. నాట్స్ కోసం బినోదిని తన కారును  విరాళంగా ఇవ్వడంపై నాట్స్ నాయకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

చదవండి: భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం 

మరిన్ని వార్తలు