అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు, స్థానిక డ్రైవర్‌ మృతి  

23 Apr, 2022 10:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని ఇల్లినాయిస్‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలిలా ఉన్నాయి.. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారే టౌన్‌ నుంచి ఈస్ట్‌ కేప్‌కు వేగంగా వెళుతున్న ఫియట్‌ కారు అదుపుతప్పి సెంటర్‌ లైన్‌ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెళ్లి ఆ రోడ్డుపై వస్తున్న టయోటా కారును ఢీకొంది. ఈ ఘటనలో ఫియట్‌ కారు నడుపుతున్న డ్రైవర్‌ మారీ మ్యూనియర్‌ (32)తోపాటు అందులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి (23), టయోటా కారు నడుపుతున్న పవన్‌ స్వర్ణ (23) అక్కడికక్కడే కన్నుమూశారు.

టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్‌ ఉప్పలపాటి, కాకుమాను కార్తీక్, డోర్న కల్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్‌ టౌన్‌లోని సదరన్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తున్నట్లు ఇల్లినాయిస్‌ స్టేట్‌ పోలీసు విభాగం గుర్తించింది. వీరిలో కల్యాణ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతుండగా.. మిగిలిన వాళ్లంతా కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యసిస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో అక్కడి పోలీసులు రూట్‌ 3ని కొన్ని గంటల పాటు మూసేశారు.  

మరిన్ని వార్తలు