లండన్: ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఆన్లైన్లో ఈ నెల 18 న “ఉగాది సంబరాలు 2021” వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా అసోసియేషన్ 19 వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. కాగా లాక్డౌన్ కారణంగా ఈసారి కూడా వేడుకలను ఆన్లైన్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ రాజకీయ నేత, నటుడు డాక్టర్ బాబు మోహన్ హాజరయ్యారు. స్కాట్లాండ్, యూకేలోని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తన రాజకీయ అనుభవాలు, సినీ ప్రస్థానం గురించి తెలుగు ప్రజలతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పర్రి మాట్లాడుతూ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరపున ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మదర్స్డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అంతేకాకుండా భారత్ నుంచి యూకే, స్కాట్లాండ్కు ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం వస్తోన్న విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామనీ ప్రకటించారు. ఉగాదిపర్వదినం సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శివ చింపిరి, చైర్మన్ మైధిలి కెంబూరి, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్, విజయ్కుమార్, మాధవి లత, ఉదయ్కుమార్ తదితరలు హజరయ్యారు.