ఎన్‌ఆర్‌ఐలు అదుర్స్‌, ఆన్‌లైన్‌లో బతుకమ్మ సంబరాలు

24 Oct, 2020 08:49 IST|Sakshi

సిడ్నీ: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలను ఏకం చేసి సిడ్నీ బతుకమ్మ అండ్‌ దసరా ఫెస్టివల్ ఇన్‌కార్పొరేటెడ్ అసోసియేషన్(ఎస్‌బీడీఎఫ్‌), ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం(ఏటీఎఫ్‌)మొట్టమొదటిసారిగా వర్చువల్ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఎస్‌బీడీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో శనివారం అ‍ట్టహాసంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారై ప్రతినిధులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు అదేవిధంగా న్యూజిలాండ్‌, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, మలేషియా, దుబాయ్  వంటి  పలుదేశాల నుంచి కూడా తెలంగాణ ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగ ఒకే చోట గుమికూడకుండా, అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ వినూత్నంగా ఆన్‌లైన్‌ ద్వారా ఎవరి ఇంట్లో వారు ఉండి సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఆట పాటలతో సిడ్నీ  పర‌వ‌శిచింది.

సిడ్నీలోని అన్ని ప్రాంతాల నుంచి ఆన్లైన్ బతుకమ్మ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది బతు‍కమ్మ ఉత్సవాలను ఇలా ఆన్‌లైన్‌లో నిర్వహించారు.  వర్క్ ఫ్రొం హోమ్ ఎలా అయితే అలవాటు చేస్తున్నామో అదేవిధంగా బతుకమ్మ ఆడే విధానాన్ని  కూడా మార్చుకోవడం జరిగిందని  నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరమ్మను కరోనా నుంచి కాపాడమని కోరుకుంటూ మహిళలు పాటలు పాడి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీడీఎఫ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తోతుకుర్‌ మాట్లాడతూ, ఎస్‌బీడీఎఫ్‌ ప్రధాన  ఆశయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటం అని  తెలిపారు. ఇప్పటి తరం యువతీ యువకులకు, పిల్లలకు నేర్పించినట్లయితేనే మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లగలమని ఆయన చెప్పారు. అందరూ ఆన్‌లైన్‌ ద్వారా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  500 మంది వరకు ఈ బతుకమ్మ వేడుకలలో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు.

చదవండి: అమెరికా బ్యాలెట్‌ పేపర్‌పై తెలుగు

మరిన్ని వార్తలు