Viral Video: అమెరికాలో ‍ క్రిస్మస్‌ పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి మృతి

22 Nov, 2021 13:27 IST|Sakshi

అమెరికన్లు క్రిస్మస్‌ పండుగ సంబరాల్లో మునిగిన వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పరేడ్‌పైకి ఓ వ్యక్తి వేగంగా కారుతో దూసుకెళ్లడంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అమెరికాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. 

క్రిస్మస్‌ పండగకి ముందు పరేడ్‌ను నిర్వహించడం ఆనవాయితీ. అమెరికాలోని విస్కన్‌సిస్‌ రాష్ట్రంలో మిల్‌వాకీ శివారులోని వాకీషా టౌన్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం భ​క్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ పరేడ్‌ని నిర్వహిస్తున్నారు. వందల మంది వరుసలో పాటలు పాడుకుంటూ నెమ్మదిగా రోడ్డుపై ర్యాలీగా వెళ్తున్నారు. వేల మంది రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆ పరేడ్‌ తిలకిస్తున్నారు. ఇంతలో హటాత్తుగా ఎరుపురంగులో ఉన్న ఒక ఎస్‌యూవీ కారు పరేడ్‌పైకి దూసుకెళ్లింది. వరుసలో నడుస్తున్న వారిని ఢీ కొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటనా స్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. 

ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవరును పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
 

మరిన్ని వార్తలు