ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లికి చెందిన భక్తులు రూ.6 లక్షల విలువైన బంగారపు లక్ష్మీ కాసుల హారం, కాసుల నక్లెస్లను శుక్రవారం విరాళంగా అందచేశారు. భీమవరపు సామిరెడ్డి, జె.వి.డి.వి.ప్రసాద్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో భ్రమరాంబను కలిసి బంగారపు హారాలు అందచేశారు. సుమారు రూ. 3.5 లక్షల వ్యయంతో 52 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారం, రూ.2.5 లక్షల వ్యయంతో 25 గ్రాముల కాసుల నక్లెస్ను అమ్మవారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
దుర్గమ్మ సేవలో మంత్రి బొత్స కుటుంబం...
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.
మంత్రి చెల్లుబోయిన...
దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి ప్రసాదాలు అందచేశారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్...
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ్ప్రతాప్రెడ్డి దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయ్ప్రతాప్రెడ్డిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందచేశారు. పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తెయ్య, కేసరి నాగమణి పాల్గొన్నారు.