ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం

26 Mar, 2023 01:42 IST|Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఈవో తీరుతో షాపులు మూసివేశామని, దీంతో తమ కుటుంబాలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నాయంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కనకదుర్గనగర్‌లో చోటు చేసుకుంది. షాపుల యజమానుల ఆందోళన శనివారంతో 5వ రోజుకు చేరుకొంది. దుకాణాల బకాయిలు మూడు రోజుల్లో చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో నోటీసులు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈవో తీరుకు నిరసనగా దుకాణ యజమానులు తమ కుటుంబాలతో సహా షాపుల ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. షాపులకు కనీస సదుపాయాలు కల్పించకుండా అద్దెలను చెల్లించమని బెదిరింపులకు పాల్పడటం సరికాదని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఈవోను కోరామని, కనీసం మాట్లాడే వీలు కూడా లేకుండా పోయిందన్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తుంటే.. ఎటువంటి అద్దెలు లేకుండా రోడ్లను ఆక్రమించుకున్న వారికి అండగా నిలుస్తుందో ఎవరో దేవస్థాన అధికారులు తేల్చాలని కోరారు. దుకాణాల అద్దెలను తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు.

కనకదుర్గనగర్‌లో దుకాణదారుల ఆందోళన

మరిన్ని వార్తలు