భార్య పొలం అమ్మలేదని భర్త బలవన్మరణం

27 Mar, 2023 01:28 IST|Sakshi

పెనమలూరు: భార్య కట్నం కింద తెచ్చిన పొలం అమ్మలేదని కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పెనమలూరు గ్రామంలో జరిగింది. పెనమలూరు సీఐ ఆర్‌.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం 12 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా రాయపట్నంకు చెందిన మాదల మల్లీశ్వరి పెనమలూరులో అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న గోపిని(30) వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చి రాయపట్నంలో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. ఆమె భర్త గోపి కట్నం కింద ఇచ్చిన పొలం అమ్మాలని భార్యతో తగాదా పడుతూ చనిపోతానని బెదిరించసాగాడు. దీంతో భార్య మల్లీశ్వరి తన మామ వెంకటేశ్వరరావు, బావ నాగరాజుకు చెప్పగా రెండు రోజుల క్రితం వారు వచ్చి గోపిని మందలించి వెళ్లారు. ఆదివారం ఉదయం భర్త ఇంట్లో ఉన్న సమయంలో భార్య మల్లీశ్వరి ఇళ్లల్లో పనికని బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అయితే గోపి చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో పిల్లలు బిగ్గరగా అరిచారు. అపార్టుమెంట్‌ వాసులు వచ్చి చూడగా అప్పటికే గోపి మృతి చెందాడు. ఘటనపై భార్య మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు