విజయవాడ స్పోర్ట్స్: ఆంధప్రదేశ్ స్టేట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగింది. స్టార్ టెన్నిస్ అకాడమీ, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన విజయవాడ శివారు నిడమానూరులో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. అండర్–12, అండర్–14, అండర్–16 సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు తలపడ్డారు. అండర్–12 బాలుర విభాగంలో వై.క్రిష్, అఖిల్, బాలికల విభాగంలో ప్రణీత, హారిక, అండర్–14 బాలుర విభాగంలో డి.అఖిల్, ఇషాన్ఖాన్, బాలుర విభాగంలో ప్రణీత, ఇషిత పట్నాయక్, అండర్–16 బాలుర విభాగంలో వెంకటకృష్ణ, అన్షిన్ అగర్వాల్, బాలికల విభాగంలో రూపాదేవి, ఇషితా పట్నాయక్ వరుసగా విన్నర్, రన్నర్ ట్రోఫీలను కై వసం చేసుకున్నారు. విజేతలకు నిడమానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ శీలం రంగారావు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను స్టార్ టెన్నిస్ అకాడమీ డైరెక్టర్ కె.గోపాల్ పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో ఐటా సీఎస్–7 పోటీలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
‘వయ్యారి భామ’ను నిర్మూలించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): శరీరంపై దద్దుర్లు, దురద వంటి ఎలర్జీ లక్షణాలకు గురిచేసే పార్థీనియం(వయ్యారి భామ) మొక్కలపై ప్రజలలో అవగాహన కల్పించి వాటిని సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఆదేశించారు. ఈ మొక్కల నిర్మూలనపై ఆదివారం మున్సిపల్, పంచాయతీ, ఐసీడీఎస్, భూ గర్భజల శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్థీనియం మొక్కలు పశువులు, మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయన్నారు. పార్థీనియం మొక్క పువ్వుల నుంచి విడుదలైన పుప్పొడి పలు ఎలర్జీలకు దారి తీస్తుందన్నారు. అనేకమంది ఆస్తమా బారిన పడుతున్నారన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం సామూహిక పార్థీనియం మొక్కల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్లో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు వైవీ ప్రసన్న లక్ష్మి, ఎ. రవీంద్రరావు, డీపీవో జె. సునీత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ పాల్గొన్నారు.
నేడు దుర్గగుడి పాలక
మండలి సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన పాలక మండలి సమావేశం సోమవారం జరగనుంది. మహా మండపం నాలుగో అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. దుర్గగుడి పాలక మండలి ఫిబ్రవరి ఏడో తేదీన ఏర్పడింది. పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది రెండో సమావేశం. గత నెల 27వ తేదీన జరిగిన తొలి సమావేశంలో భక్తుల సౌలభ్యం కోసం పాలక మండలి కొన్ని ప్రతిపాదనలు చేసింది. దుర్గాఘాట్ నుంచి భక్తులకు ఉచిత బస్సు సర్వీసు, ఉచిత చెప్పల స్టాండ్, పొంగలి షెడ్డు, హారతి సేవలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించే అంశాలు ఉన్నాయి. వీటిలో ఘాట్రోడ్డులో పొంగలి షెడ్డు ఏర్పాటు చేయడం మినహా మిగిలిన ప్రతిపాదనలు ఇంకా ఆచరణలోకి రాలేదు. వీటిలో కొన్నింటికి దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. వాటిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.