ఉంగుటూరు(గన్నవరం): ప్రతి ఒక్కరూ పీచు ఎక్కువ ఉన్న సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వలీ అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్లో రైతు నేస్తం ఫౌండేషన్, ట్రస్ట్ సంయుక్తంగా సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అందరూ సిరి ధాన్యాలైన కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి పీచు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండే వారని తెలిపారు. ప్రతి రోజు ఉదయాన్నే శారీరక శ్రమతో పాటు, మంచి ఆహారపు అలవాట్లతో క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ వై.వెంకటేశ్వరరావు ప్రసంగించారు.
ఎన్టీటీపీఎస్లో మారిన బయోమెట్రిక్ వేళలు
ఇబ్రహీంపట్నం(మైలవరం): ఎన్టీటీపీఎస్లో బయోమెట్రిక్ సమయాలను మార్పులు చేస్తూ ఏపీ జెన్కో సంస్థ ఎండీ శ్రీధర్ ఈ నెల 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. నూతన విధానంలో ఉదయం, సాయంత్రంతో పాటు మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్, తిరిగి రెండు గంటలకు విధులకు హాజరయ్యేటప్పుడు కూడా బయోమెట్రిక్ వేయాలి. మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు పాత పద్ధతుల్లో విధులకు హాజరయ్యే ముందు, తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ వేయాల్సి ఉంది.