శ్రీకాకుళం క్రైమ్ : ఒంటరిగా రాత్రివేళ ప్రయాణంలో ఇరుక్కున్న మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చేలా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎస్పీ జి.ఆర్.రాధిక. అదే డ్రాప్ టు హోమ్. మీరు చేయాల్సిందల్లా టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయడమే. వెంటనే పోలీసులు స్పందించి తమ వాహనంలో మహిళలను వారి ఇంటి వద్ద సురక్షితంగా చేర్చుతారు. ఈ మేరకు ఎస్పీ రాధిక బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రాత్రి వేళ 11 గంటల తర్వాత ఇంటికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేనిపక్షంలో అధైర్యపడకుండా 112కు కాల్ చేస్తే సబ్ డివిజనల్ పరిధిలోని దిశా వాహనాలు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాహనాల ద్వారా ఇంటికి చేరుస్తారని పేర్కొన్నారు. రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, దగ్గరలో ఉన్న బస్సు, రైల్వే స్టేషన్లలో ఉన్న పోలీస్ ఔట్ పోస్టులు, రైల్వే పోలీసు రక్షక స్టేషన్లో వేచి ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రతి మహిళా ఫోన్లో దిశా యాప్ నిక్షిప్తం చేసుకోవాలని ఎస్పీ కోరారు.
రాత్రివేళ సురక్షితంగా ఇంటికి చేర్చేలా ‘డ్రాప్ టు హోమ్’
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ రాధిక