నెల్లిమర్ల: జిల్లాలోని ఎంజేపీఏపీ బీసీ గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4వ తేదీవరకు గడువు ఉందని ఆ గురుకులాల కన్వీనర్ కేబీబీ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మూడు బాలికలు, నాలుగు బాలుర పాఠశాలలున్నాయని చెప్పారు. ఆయా పాఠశాలల్లో ఐదో తరగతిలో మొత్తం 440 సీట్లున్నాయని, వాటిలో 200 బాలికల కోసం, 240 బాలుర కోసం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష ఉంటుందని కన్వీనర్ తెలిపారు. పరీక్ష రాయడానికి మూడు రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాకు చెందిన విద్యార్థులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.