పర్లాకిమిడి: ఒడియా భాష, సంస్కృతి, సాహిత్య విభాగం, గురు కేళూచరణ్ మహాపాత్రొ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో భువనేశ్వర్లోని ఉత్కళరంగ మంచ్ వేదికలో సంగీత మహోత్సవం నిర్వహించారు. ఇందులో పర్లాకిమిడికి చెందిన ప్రముఖ సంగీత దర్శకులు రఘునాథ పాత్రొ నిర్వహించిన సంగీత విభావరి విశేష ప్రేక్షకాధరన పొందింది. హార్మోనియంలో బాలకృష్ణ జెన్నా, మృదంగం సీతాకాంత జెన్నా, వేణుగానం సౌమ్యరంజన్ జోషి సహకరించారు. ఈ సందర్భంగా సంగీత గురువులు గోపాలచంద్ర పండా, పద్మశ్రీ శ్యామమణీ దేవి, గురు ధనేశ్వర స్వొని, సుభాష్చంద్ర ఆచార్య, తరిణీ మిశ్రా తదితరులు రఘునాథ పాత్రొను దుశ్శాలువ, మొమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షుడు నృసింహచరణ్ పట్నాయక్, రంగస్థల నటులు దేవేంద్రదాస్, భక్తి సంగీత సంసద్ కార్యదర్శి పూర్ణచంద్ర తదితరులు అభినందనలు తెలియజేశారు.
21కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: గంజాయి అక్రమ రవాణాలను కొరాపుట్ పోలీసులు అడ్డుకున్నారు. సునాబెడా పోలీసు పరిధిలోని జడాగుడా గ్రామానికి చెందిన రాజు బొత్ర 21.5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అతని కదలికలు పసిగట్టి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి సరుకును సీజ్ చేసుకొని, కేసు నమోదు చేయడంతో పాటు కోర్టుకు తరలించారు.