రాయగడ: ఆదివాసీ, హరిజన జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడకు మరిన్ని వైద్య సౌకర్యాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్తగా ఐదుగురు వైద్యులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటన వెల్లడించింది. వైద్యుల కొరత కారణంగా జిల్లాలో వైద్య సేవలు మృగ్యమవుతున్నాయని ఇటు నాయకులు, అటు జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. కొత్తగా నియమితులైన వారిలో జిల్లా కేంద్రాస్పత్రికి డాక్టర్ లాడి రమేష్ను నియమిస్తున్నట్లు ప్రకించగా, గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి డాక్టర్ నిహార్రంజన్ సాహు, డాక్టర్ శ్రీధర్ భొలో, డాక్టర్ అరుణ్కుమార్ బిసోయి, డాక్టర్ పృథ్వీరాజ్ ప్రధాన్ లను కేటాయించారు. కొద్ది రోజుల క్రితం రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి, గుణుపూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గమాంగొ తోపాటు బిజూ స్వాస్థ్య సమితి రాష్ట్రశాఖ సలహాదారుడు సుధీర్కుమార్ దాస్ తదితరులు స్థానిక సమస్యలను రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ షాలినీ పండిట్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.