అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..

1 Oct, 2020 19:43 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్‌ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్‌‌ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. (చదవండి : హత్రాస్‌ బాధితురాలిపై రేప్‌ జరగలేదు)

అయితే యువకుని తల్లి వివరాల మేరకు సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు తల్లి, కొడుకులు ఆటోలో కలసి బయలుదేరారు. అసెంబ్లీ భవన్‌ వద్దకు చేరుకోగానే యువకుడు సైకోలాగా ప్రవర్తిస్తూ బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని ఆటో నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత తల్లి మెడపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పాటు బీజేడీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశాడు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని అతని వద్ద​ నుంచి కత్తి స్వాధీనం చేసుకొని తల్లిని విడిపించి యువకుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళుతుండగా.. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భువనేశ్వర్‌ డీసీపీ ఉమాశంకర్‌ దశ్‌ పేర్కొన్నారు. కాగా యువకుడు కత్తితో సైకోలాగా ప్రవర్తిస్తూ హల్‌చల్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : భారీ చేపతో బామ్మకు జాక్‌పాట్)‌

మరిన్ని వార్తలు