క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

26 Mar, 2021 06:28 IST|Sakshi

ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

పారిస్‌: ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ సైనా 18–21, 21–15, 21–10తో మరీ బటోమెనె (ఫ్రాన్స్‌)పై చెమటోడ్చి నెగ్గింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా... అనంతరం పుంజుకొని తర్వాతి రెండు గేముల్లోనూ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఐరా శర్మ (భారత్‌) 21–18, 21–13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై గెలిచి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ శ్రీకాంత్‌ 21–17, 22–20తో చెమ్‌ జునే వీ (మలేసియా)పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ పోరుల్లో అర్జున్‌– ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 21–11, 21–12తో రోరీ ఇస్టోన్‌–జాక్‌ రస్‌ జంట (ఇంగ్లండ్‌)పై, కృష్ణ ప్రసాద్‌– విష్ణువర్ధన్‌ (భారత్‌) జోడీ 21–7, 21–13తో క్రిస్టియన్‌ క్రెమర్‌–మార్కస్‌ (డెన్మార్క్‌) ద్వయంపై గెలిచాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ధ్రువ్‌ కపిల–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 21–12, 21–18తో కాల మ్‌ హెమ్మింగ్‌–విక్టోరియా విలియమ్స్‌ (ఇంగ్లండ్‌) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌ చేరింది. సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 10–21, 7–21తో నిక్లాస్‌ నోర్‌– అమలీ మెగెలండ్‌ (డెన్మార్క్‌) ద్వయం చేతిలో ఓడింది.
 

మరిన్ని వార్తలు