రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు

25 Feb, 2023 08:58 IST|Sakshi

తెనాలి: వైఎస్సార్‌ రైతు భరోసా లబ్ధిదారులకు మూడో విడత ఆర్థిక సాయం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కోసం ఈ నెల 27వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టణానికి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ శుక్రవారం సమీక్షించారు. అవసరమైన సూచనలను చేశారు. ముందుగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగే బహిరంగ సభా ప్రాంతం, కవిరాజ నగర్‌లోని హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం మార్కెట్‌ యార్డు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దారి వెంట బారికేడ్లను నిర్మించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌ వద్ద గ్రీన్‌రూమ్‌, టెంట్లను ఏర్పాటు చేయాలని, రైతులు సభకు వచ్చి వెళ్లేందుకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ, లా అండ్‌ ఆర్డర్‌ అదనపు ఎస్పీ అనిల్‌కుమార్‌, క్రైమ్‌ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కె.కోటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌, పొన్నూరు పోలీసు అధికారులు, స్పెషల్‌ బ్రాంచి సీఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు