దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి...

26 Feb, 2023 01:12 IST|Sakshi
మృతుడు లతీఫ్‌
మార్టూరు: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కోనంకి ఇసుక దరిశి గ్రామాల మధ్యన శుక్రవారం రాత్రి జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని కుమ్మరిపాలెం కాలనీకి చెందిన షేక్‌ లతీఫ్‌ (24), ఎల్లగాల నరేంద్ర, కన్నెబోయిన అవినాష్‌, సురేష్‌, గోపి స్నేహితులు. వీరిలో లతీఫ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం రావడంతో రెండు నెలల్లో వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అవినాష్‌ తన కాబోయే భార్యతోపాటు తన ముగ్గురు స్నేహితులతో కలిసి తిరుమల దైవ దర్శనానికి వెళ్లా రు. దైవ దర్శనం అనంతరం శుక్రవారం స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. నరేంద్ర కారు నడుపుతుండగా జాతీయ రహదారిపై కోనంకి సమీపంలోకి రాగానే కారు ముందు టైరు ఒక్క సారిగా పేలడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని తాకుతూ వెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్‌ పక్కన కూర్చొన్న లతీఫ్‌ తలకు గాయాలు కాగా మిగిలిన నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షత గాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభు త్వాసుపత్రికి తరలించారు. లతీఫ్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వార్తలు