చేబ్రోలు: యువతలో వచ్చే మార్పుతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా సీసీఎస్ డీఎస్పీ బీ.మోజెస్ పాల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆదివారం రోడ్డు భద్రత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయే వారిలో ఎక్కవ మంది యువతే ఉన్నారని పేర్కొన్నారు. యువత ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చరాదన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదాల్లో మరణించకూడదనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత పెడచెవిన వేస్తున్నారన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీ రాఘవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కన్సల్టెంట్ ఎం.డి.హనీఫ్ మాట్లాడుతూ ప్రయాణికులను సుఖంగా, భద్రంగా గమ్యం చేర్చాలన్నా, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నా డ్రైవర్ల అప్రమత్తతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ గురించి వివరించారు. ఆయా విభాగాల డీన్లు, అధ్యాపకులు, వర్సిటీ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా సీసీఎస్ డీఎస్పీ బి.మోజెస్ పాల్
రోడ్డు భద్రతపై విజ్ఞాన్లో అవగాహన కార్యక్రమం