టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

4 Jun, 2021 10:18 IST|Sakshi

ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా?

అది ప్రగతిభవన్‌ కాదు.. బానిస భవన్

ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం

మీడియా సమావేశంలో ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని.. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తాన వివరణ కూడా అడగలేదన్నారు.

‘‘హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్‌ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని’’ ఈటల రాజేందర్‌ అన్నారు. ‘అది ప్రగతిభవన్‌ కాదు.. బానిస భవన్’ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు.

సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ ఒక్కరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రూ.వందల కోట్లు ఇన్‌కంట్యాక్స్‌ కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. హరీష్‌రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆకలినైనా భరిస్తాం.. ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. కేసీఆర్‌ హయాంలో మంత్రులకు , అధికారులకు స్వేచ్ఛ లేదని ఈటల అన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

చదవండి: భూముల డిజిట‌ల్ స‌ర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
Telangana: తడిచె.. మొలకెత్తే.. 

మరిన్ని వార్తలు