21 మంది టీఎంసీ ఎ‍మ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. సరైన సమయంలో మమతకు షాక్‌ ఇస్తాం..

24 Sep, 2022 16:24 IST|Sakshi

కోల్‌కతా: ప్రముఖ నటుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు  ఇంకా తనతో నేరుగా టచ్‌లోనే ఉన్నారని చెప్పారు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పానని, మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కోల్‌కతాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మిథున్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై తమ నాయకులు కొందరు అభ్యంతరాలు తెలిపారని మిథున్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులు తమకు అవసరం లేదని సూచించారని చెప్పారు. అయితే తనకు ఈ విషయంపై అవగాహన ఉందని, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

మిథన్ చక్రవర్తి గతంలోనూ ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చి వార్తల్లో నిలిచారు. 20మందికిపైగా టీఎంసీ ఎ‍మ్మెల్యేలు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతురాని రెండు నెలల క్రితమే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ నాయకులు అప్పుడు తోసిపుచ్చారు. మిథున్‌కు  మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. ఓసారి వైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి మళ్లీ తన వ్యాఖ్యలకు కట్టుబటి ఉన్నానని చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ

మరిన్ని వార్తలు