-

హిందూపురంలో బాలయ్యకు ఓటు దెబ్బ 

16 Mar, 2021 07:49 IST|Sakshi

హిందూపురంలో  వైఎస్సార్‌సీపీ పాగా

భారీగా పెరిగిన ప్రజా మద్దతు

51.51 శాతంతో ఆదరించిన ఓటర్లు

10 వార్డుల్లో టీడీపీ మూడో స్థానానికే పరిమితం

సాక్షి, హిందూపురం‌: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే హిందూపురంలో ఏకంగా 51.51శాతం ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలవడం విశేషం. ఇదే సమయంలో టీడీపీ కేవలం 30.31శాతానికే పరిమితమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం పట్టణంలో టీడీపీకి 9,655 ఓట్ల మెజార్టీ రాగా, ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 14,647 ఓట్ల మెజార్టీని కట్టబెట్టడం ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది.

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా 38 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 29 స్థానాలను కైవసం చేసుకోగా.. టీడీపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. అదేవిధంగా 10 వార్డుల్లో(1, 5, 11, 13, 15, 16, 22, 23, 24, 26వ వార్డులు) టీడీపీ మూడో స్థానానికే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇక్కడే మకాం వేసి ఇంటింటి ప్రచారం చేసినా, ప్రచార రథం ఎక్కి హడావుడి చేసినా.. చెంపదెబ్బలకు తాళలేకపోయిన ఓటర్లు ఆరు స్థానాలకే పరిమితం చేస్తూ ఓటుతో దెబ్బ కొట్టడం గమనార్హం. 

పోలైన ఓట్లు ఇలా.. 
హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో 78,259 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. వైఎస్సార్‌సీపీకి 40,310(51.51 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీకి 23,718 ఓట్లు(30.31 శాతం), బీజేపీకి 3,557(4.55 శాతం), ఎంఐఎం 4,277(5.47 శాతం) ఓట్లతో సరిపెట్టుకున్నాయి. స్వతంత్రులకు 4,617 ఓట్లు, నోటాకు 687 ఓట్లు.. సీపీఐకి 640, జనసేనకు 388, కాంగ్రెస్‌కు 38, బీఎస్పీకి 27 ఓట్లు పోలయ్యాయి.

చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ
ఏయ్‌.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య  

మరిన్ని వార్తలు