ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే ఇలా!

3 Sep, 2021 19:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్‌ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు ఏబీపీ సీ-ఓటర్‌ సర్వేలో వెల్లడించింది.

కాగా పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్‌ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్‌ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్‌ షేర్‌తో ఆప్‌ 55 సీట్లు సాధిస్తుందని ఏబీపీ సీఓటర్‌ సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్‌ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీసీ సీఓటర్‌ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

యూపీలో బీజేపీకి 259 నుంచి 267 సీట్లు
యూపీలో బీజేపీకి కాస్త ప్రాబల్యం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా  అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే నిర‍్వహించిన సర్వేలో 44 శాతం మంది సీఎం యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది.

గోవాలోనూ బీజేపీదే హవా!
గోవాలో కూడా బీజేపీకే తిరిగి అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే తెలిపింది.  బీజేపీ 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, అదే సమయంలో ఆప్‌ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్‌ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే.. ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది.

మణిపూర్‌లో బీజేపీకే ఆధిక్యం
మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి  నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్‌ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్‌ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది.

ఉ‍త్తరాఖండ్‌లో బీజేపీ కూటమికి 46 సీట్లు
70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి  46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్‌ తన సర్వేలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 38-46 సీట్లు, ఆప్‌కు 51-57 సీట్లు
రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఆప్‌ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్‌ తెలిపింది.

చదవండి: ‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’
చదవండి: Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి

మరిన్ని వార్తలు