అవినీతికి ప్రతీక అదానీ.. రాహుల్‌ విమర్శల వర్షం

17 Apr, 2023 06:12 IST|Sakshi

కోలారు: అదానీపై చూపిస్తున్న ప్రేమను ప్రధాని మోదీ పేద ప్రజలపై ఇసుమంతైనా చూపించడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు పట్టణంలో నిర్వహించిన జై భారత్‌ సభలో ప్రధాని మోదీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. గతంలో కోలారులోనే మోదీపై ఆరోపణలు చేసిన కేసులో రాహుల్‌కు జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే.

ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, జైలుపాలు చేసినా ప్రభుత్వాన్ని చూసి భయపడేది లేదని స్పష్టం చేశారు. అదానీ అవినీతికి మారుపేరని పేర్కొన్నారు. ‘అదానీ విమానంలో ప్రధాని మోదీ అత్యంత రిలాక్స్‌ మూడ్‌లో ఎందుకు కూర్చుంటారు? అదానీ కంపెనీలో చైనా డైరెక్టర్‌ ఎందుకు ఉన్నారు?’అని రాహుల్‌ ప్రశ్నించారు. మోదీ, అదానీ సంబంధాలపై ప్రశ్నించినప్పుడల్లా బీసీ వర్గాన్ని అవమానించానంటూ తనవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు