లోకేష్‌ తీరుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం

30 Dec, 2020 16:58 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : నారా లోకేష్ తీరుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సాక్షి పత్రిక ప్రతులను తగాలబెడతావా అని లోకేష్‌పై నిప్పులు చెరిగారు. పత్రికలపై గౌరవం ఉన్న వారు ఇటువంటి పని చేయరని పేర్కొన్నారు. అలాగైతే తప్పుడు కథనాలు రాస్తున్న మీ పచ్చ పత్రికను మేమేం చేయాలని ప్రశ్నించారు. దానిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాకు ఏ పథకం అందలేదని కొందరితో చెప్పించి మీ అనుంగు పత్రికలో అబద్దాలు రాయించారని మండిపడ్డారు. వాళ్ళు పొందిన లబ్దికి ఆధారాలు ఉన్నాయని చూపించారు. మీ పత్రికలో రాసిన మేడపి గ్రామ వాసులు రేగుల కాశయ్య, అనురాధ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా 2లక్షల 88వేల 545 పాయలు అందాయని స్పష్టం చేశారు. అమ్మఒడి రాలేదని రాసిన రేగుల అనురాధ ఖాతాలో గత ఏడాది రూ 15 వేలు జమ అయ్యిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చదవండి: పప్పూ... ఇది తప్పు!!

కాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేష్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన్ను ‌చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలని, తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలని మండిపడుతున్నారు. ఈయనకు ప్రజాస్వామ్యమన్నా.. దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు