తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు

9 Mar, 2021 06:24 IST|Sakshi

అన్నాడీఎంకే– బీజేపీ, డీఎండీకే మధ్య చర్చలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్‌హాసన్‌ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం.

డీఎంకే సీట్ల పంపకాలు
డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్‌ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్‌ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్‌కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్‌ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్‌ వీరప్పన్‌  భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్‌ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు.  
    

మరిన్ని వార్తలు