‘ఆమెతో మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం’

14 Jun, 2021 20:54 IST|Sakshi

చెన్నై: అసెంబ్లీ డిప్యూటీ లీడర్, అసెంబ్లీ విప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓ కొత్త తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రకారం.. ఇకపై శ‌శిక‌ళ‌తో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తప్పవని త‌మ నేత‌ల‌ను హెచ్చరించింది. సోమ‌వారం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏక‌గ్రీవంగా ఆమోదించింది. 

ఇటీవల శశికళ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయట పడింది. ఆ వీడియోలో.. తాను తొందరలోనే క్రీయాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నట్లు, తర్వాత అన్నాడీఎంకేపై పార్టీపై ప‌ట్టుసాధిస్తాన‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌తో మాట్లాడుతుంది. ఈ ఆడియో విన్న తర్వాత పార్టీ  నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శశికళతో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నాడీఎంకే నేతలు తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా శ‌శిక‌ళ‌తో మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది.

చదవండి: Tamilnadu: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ

మరిన్ని వార్తలు