‘కేంద్రంలో అధికార మార్పునకు అదే సంకేతం’

19 Aug, 2022 06:11 IST|Sakshi

బీజేపీ అధికారానికి దూరమవడంపై అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్య

లక్నో: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అధికార పీఠాన్ని చేజార్చుకుందని, ఈ పరిణామం హస్తినలో అధికార మార్పునకు శుభసూచక మని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే బలమైన జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అఖిలేశ్‌ లక్నోలో పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సరిసాటి అయిన ప్రత్యామ్నాయ కూటమి అవతరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్‌ల నాటి స్వల్పకాలిక కూటమి ప్రభుత్వాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుస్థిర, అభివృద్ది చోదక, ప్రభావవంతమైన నాయకత్వంలో కొనసాగే ప్రభుత్వాన్నే ప్రస్తుతం దేశం కోరుకుంటోంది’ అని అఖిలేశ్‌ అన్నారు.

మీరు కోరింది ఇదేగా: రవిశంకర్‌ ప్రసాద్‌
‘సుధృఢ ప్రభుత్వం కావాలనేదే మీ అభిలాష. ప్రధాని మోదీ సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అదే’ అంటూ అఖిలేశ్‌నుద్దేశిస్తూ బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు.

మరిన్ని వార్తలు