కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు

16 May, 2021 09:53 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  

సాక్షి, అమరావతి: రఘురామకృష్ణరాజుతో ఉన్న అపవిత్ర బంధం, ఇన్నాళ్లూ కలిసి చేసిన కుట్రలు ఎక్కడ బయటపడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లో మీడియా పెద్దలు కలవరపడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అందుకే ఆయన అరెస్టుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణరాజు ఏ విధంగా రాజద్రోహానికి పాల్పడ్డాడో వివరిస్తూ కోర్టు ముందు 46 సీడీలను సీఐడీ ఉంచిందన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణరాజులాంటి చీడపురుగును వెనకేసుకొస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. రచ్చబండ పేరుతో రోజూ రెండు గంటలు బూతులు తిట్టించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో డ్రామా నడపటం చంద్రబాబు, లోకేష్, టీవీ5, ఏబీఎన్‌లకు అలవాటైందని మండిపడ్డారు.

కథ నడిపిస్తున్నది చంద్రబాబే..
వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణరాజు పిచ్చి వాగుడు వాగుతుంటే చంద్రబాబు సంతోషంతో ఆయన వెనుక ఉండి మరీ కథ నడిపిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో చంద్రబాబు గొంతులో పచ్చివెలక్కాయ పడిందన్నారు. తనకూ ఇదే గతి పడుతుందన్న భయం, ఆందోళన ఆయనలో కనిపిస్తున్నాయన్నారు. కృష్ణరాజుతో నిజాలు చెప్పిస్తే తమ ఇంటిగుట్టు, కుట్రలు బయటపడతాయన్న భయంతోనే నిన్న టీడీపీ, దాని అనుబంధ చానెళ్లు ఆయనకు వత్తాసు పలికాయన్నారు. కోర్టు బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన వెంటనే కృష్ణరాజులో ఎంత మార్పు వచ్చిందో, ఎలాంటిæ డ్రామా ఆడారో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వివరించారని తెలిపారు. కృష్ణరాజు మహానటుడని, తనకు తాను గాయాలు చేసుకొని మరీ బయటపడాలని ప్రయత్నించగల సమర్థుడని చెప్పారు.

బాబు దర్శకత్వంలోనే స్కెచ్‌
చంద్రబాబు దర్శకత్వంలోనే కృష్ణరాజు స్కెచ్‌ వేసి ఉంటారని అంబటి అభిప్రాయపడ్డారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు.. ఆయనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరమని చంద్రబాబు అనడం ఆయనలో భయాన్ని చూపిస్తోందని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి వంటి బీజేపీ నేతలు కూడా బాబు వాదనకు మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. కృష్ణరాజు వ్యాఖ్యలు.. రాజద్రోహమో, కాదో చెప్పాల్సింది కోర్టులే తప్ప చంద్రబాబు కాదని తేల్చిచెప్పారు. ఆయనపై ఎవరూ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడలేదన్నారు. కృష్ణరాజు టీడీపీతో జతకట్టి ఏడాదిగా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా తేలాల్సి ఉందన్నారు. దీన్ని అడ్డుకునే ప్రతి ప్రయత్నం ఆయన భయంతో చేస్తున్నదే తప్ప ప్రజాస్వామ్యం మీద గౌరవంతో చేస్తున్నది కాదన్నారు. ఎన్నికల్లో గెలవలేని బాబు ఏదో రకమైన మేనేజ్‌మెంట్‌ మీదే 100 శాతం నమ్మకాలు పెట్టుకొని రఘురామరాజుతో అంటకాగుతున్నాడని విమర్శించారు. ఇంతకాలం అందరూ అనుమానించిందే నిజమైందని.. తోడు దొంగల ముసుగు ఇప్పుడు తొలగిందన్నారు.    

( చదవండి: రఘురామకృష్ణరాజుకు రిమాండ్‌ )

మరిన్ని వార్తలు