చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరలేపారు

13 Apr, 2021 17:49 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పెద్ద డ్రామాకు తెరలేపారని, రాళ్ల దాడి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పబ్లిసిటీ డ్రామా ఆడుతున్నారని, వైఎస్సార్‌ సీపీని ఎదుర్కోలేకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ, బీజేపీలకు జెండా ఉంది కానీ అజెండా లేదు. చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే స్థితిలో టీడీపీ లేదు. టీడీపీ పనైపోయిందని.. అచ్చెన్నాయుడు, ఆ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు.

కరోనా దృష్ట్యా జేపీ నడ్డాతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేయలేదని చెప్తున్నారు. పవన్‌ కరోనాకు భయపడి క్వారంటైన్‌కు వెళ్లారో?.. కరెన్సీ అందలేదని క్వారంటైన్‌కు వెళ్లారో తెలియదు. రాష్ట్రానికి బీజేపీ ఏ మేలు చేసిందో జేపీ నడ్డా చెప్పలేకపోయారు. వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది?. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ గురించి కూడా జేపీ నడ్డా మాట్లాడలేదు. ఎన్నిసార్లు విన్నవించినా పోలవరం అంచనాలను ఆమోదించలేదు. ఏం చేశారో చెప్పుకోలేని టీడీపీ, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు