టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి

30 Mar, 2021 14:09 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీలో చంద్రబాబు నాయుడు ఒక విషసర్పంలా చేరారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. సోమవారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం..అంతర్ధాన దినోత్సవంలా జరిగిందని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌లో ఓడిపోయిన తర్వాతే చంద్రబాబు టీడీపీలో చేరారని విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శిథిలావస్థకు చేరుకుందని విమర్శించారు

‘రాష్ట్ర సంక్షేమం కోసమే వైఎస్ఆర్‌సీపీకి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు హయంలో 132 శాతానికి పైగా అప్పులు చేశారు. చంద్రబాబు.. తన కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూశారు కాబట్టే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీకి విజయం అందించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదు. కేంద్రంపై నిరంతరం వైఎస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది. మళ్లీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే. చంద్రబాబు మళ్లీ వస్తాడని ఎదురు చూసి కార్యకర్తలు మోసపోవద్దు. అమరావతి, పోలవరాన్ని ఆదాయ మార్గాలుగా చంద్రబాబు మార్చుకున్నారు. రాజధానిలో లక్షల కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచిపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గుణం చంద్రబాబుదే. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు