సాక్షి, అమరావతి : ‘ అమరావతిలో జరిగింది చాలా పెద్ద కుంభకోణం. నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, వారి అనుచరులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంద’ని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నేడు జ్యూడీషియరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, న్యాయం త్వరితగతిన జరగడం లేదనే భావన ఉందన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం సబబు కాదని పేర్కొన్నారు.( చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి )
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని ఆరోపణలున్నాయి. బాబు అక్రమాస్తుల కేసు పెండింగ్లో ఉంది. 2005 నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఈ కేసు వేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసును కూడా త్వరితగతిన విచారణ జరపాల్సి ఉంద’’ని అన్నారు.