బాబు.. అఖిలప్రియని పరామర్శించరా?: అంబటి

7 Jan, 2021 15:30 IST|Sakshi

అచ్చెన్నాయుడు అరెస్టులో ఒకలా, అఖిలప్రియ అరెస్టు లో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు

సాక్షి, తాడేపల్లి: ‘పేద కార్మికుల డబ్బును కొట్టేసిన అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్‌ పరామర్శించారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియను పరామర్శించరా బాబు’ అంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘పేద కార్మికులకు సంబంధించిన నిధులను కాజేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ పరామర్శించారు. ఈ కేసును రాజకీయ ప్రతీకార కేసుగా వక్రీకరించి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువులుగా పేర్కొంటున్నవారిని  కిడ్నాప్ ‌చేసి అరెస్టయిన మరో మాజీ మంత్రి అఖిల ప్రియను పరామర్శించరా? చంద్రబాబుగారి కేబినెట్లో మంత్రి అయిన అఖిలప్రియ కిడ్నాప్‌ కేసులో ఏ–1 ముద్దాయిగా అరెస్టయితే చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరుమెదపడంలేదు. అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఒకలా, అఖిలప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. అఖిలప్రియ అరెస్టుపై తేలుకుట్టిన దొంగల్లా తండ్రీ, కొడుకులిద్దరూ ఎందుకు వ్యవహరిస్తున్నారు’ అంటూ అంబటి ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు మతం మనిషి ఎప్పుడయ్యాడు?)

‘అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినా, దాన్ని రాజకీయ వేధింపులు కేసుగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డారు. దీనికోసం ఎన్నిడ్రామాలు చేయాలో, అన్ని డ్రామాలు చేశారు. అఖిలప్రియ అరెస్టు విషయంలో మరెందుకు మౌనంగా ఉన్నారో...? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అఖిలప్రియ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబుగారి ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్‌ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే కిడ్నాప్‌ కేసు ఏపీలో జరిగి ఉంటే ఇదే చంద్రబాబుగారు, లోకేష్, వారి అనుకూల మీడియా ఎలా రచ్చ చేసేవారో మనం ఊహించుకోవచ్చు. తండ్రిలేని పిల్లను వేధిస్తున్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని.. ఇలా నాటకాలను ఆడుతూ ప్రచారాన్ని రక్తికట్టించేవారు. టీడీపీ నాయకుల నైజానికి, వారి అధినేత చంద్రబాబు డొంకతిరుగుడు వ్యవహారానికి, టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు వ్యవహారం ఒక పక్కా ఉదాహరణ’ అంటూ అంబటి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు